ఇది నా స్వీయ రచన
హాస్టల్
రాఘవ్,శ్యామ్ లకు నిర్మల, రమణమూర్తి అమ్మమ్మ తాతలు.వాళ్లు పెద్ద కూతురు సునంద పిల్లలు. అరుణ, మాధవి కి కూడా వాళ్లు అమ్మమ్మ ,తాత.
వేదాంశ్ కి, రోహిణి కి నానమ్మ, తాత.
ఇప్పుడు అందరూ ఒకే చోట తాత ఇంట్లో ఉండి ఒకే బడిలో చదువుతున్నారు. ఆ బడిలో నిర్మల ఒకప్పుడు సైన్స్ టీచర్ గా చాలా కాలం పనిచేసి మంచి పేరు తెచ్చుకున్నారు.
నిర్మల పెద్దమ్మాయి ఈ బడి తాను చదివినది , మంచిదని తన పిల్లలిద్దరినీ అక్కడ చేర్చింది. ఆ తరువాత రెండో అమ్మాయి, కొడుకు కూడా తమ పిల్లలని చేర్చేరు.
పిల్లలు ఆరుగురూ ఇంట్లో ఉంటే
అది ఇక కిష్కిందా రాజ్యమే. గొడవ పడుతుంటారు. జోకులేసుకుంటారు .చదువుతున్న పుస్తకాలు, పెన్నులు,విడిచిన బట్టలు అన్నీ ఎక్కడివక్కడే ఉంటాయి.
పిల్లలు బడికి వెళ్ళాక నిర్మల, ఆమె భర్త ఇల్లు సర్దుతారు. కానీ ఏం లాభం? వాళ్ళు ఆరుగురూ ఎవరికి నచ్చిన చోట వాళ్లు చదువుతారు, ఆడతారు,పడుక్కుంటారు.
నిర్మలకి వాళ్ళు పెట్టిన ముద్దు పేరు టైగర్. ఆవిడ అంటే వాళ్ళకి చాలా ఇష్టం. తాత దగ్గర ఎవరికీ భయం లేదు. వాళ్ళు పెంకితనం చేస్తే నిర్మల తన భర్తతో "మీరే వాళ్లని గారాబం చేస్తున్నారు" అంటుంది. చీవాట్లు పిల్లలతో పాటు తాత కి కూడా పడతాయి.
ఆ పిల్లలకి ఆ ఇల్లు ఎంత అలవాటయిపోయిందంటే సెలవులకి వాళ్ళ అమ్మానాన్నల దగ్గరకి వెళ్ళినా రెండు రోజులలో వెనక్కి తిరిగి వచ్చేస్తారు.
No comments:
Post a Comment