ఇది నా స్వీయ రచన
సరస్వతీ పుత్రిక
రమేష్ పార్కులో వాకింగ్ చేస్తున్నాడు. ఒక పెద్దాయన ఊపిరి తీసుకోవడానికి అవస్త పడుతూ సిమెంటు బెంచీమీద కూర్చున్నాడు. రమేష్ ఆయన దగ్గరకి వచ్చి ఆయనతో "మీ ఇంటికి తీసుకొని వెళ్తాను. మీరు ఆక్సిజన్ మాస్క్ పెట్టుకోవాలేమో. లేకపోతే దగ్గరలో ఉన్న ఆసుపత్రికి వెళ్దాం" అన్నాడు .
ఈలోగానే ఆయన ఫోన్ చేయడం, ఐదు నిముషాల్లో ఆయన కూతురు రాయడం జరిగింది. ఆ అమ్మాయి, రమేష్ అతనిని వాళ్ళ కారులో కూర్చోపెట్టారు.
ఆ అమ్మాయి కారు డ్రైవ్ చేస్తోంది. రమేష్ అతని పక్కనే ఉన్నాడు. ఇంటికి వెళ్ళేసరికి ఒక డాక్టర్ అక్కడ ఉన్నారు.
ఆ అమ్మాయి పేరు మహేశ్వరి.
తండ్రి పరబ్రహ్మం. ఆయన పరిస్థితి చక్కబడ్డాక రమేష్ వెళ్ళిపోదామనుకుంటే పరబ్రహ్మం కూర్చోమని సైగ చేసాడు.
పరబ్రహ్మం ఒక పత్రికా యజమాని. కూతురు మహేశ్వరి జర్నలిజం చేసి ఆ పత్రికా నిర్వాహణ బాధ్యత తనే చేపట్టింది.
పరబ్రహ్మం రమేష్ తో కొంతసేపు మాట్లాడి పంపించేసాడు. కానీ వీలయినప్పుడు మరోసారి రమ్మన్నాడు.అతను రమేష్ ఫోన్ నంబర్ కూడా తీసుకున్నాడు.
మరి కొన్నాళ్ళు అయ్యాక రమేష్ వచ్చి పరబ్రహ్మం ని కలిసాడు. రమేష్ డిగ్రీ పూర్తవగానే చిన్న ఉద్యోగంలో చేరి అక్కడే పని చేస్తున్నాడు.
రమేష్ పరబ్రహ్మం దగ్గరకి వెళ్తే ఒక పట్టాన వదిలేవాడు కాదు. ఏవో ఒకటి చెప్తుండేవాడు. ఏదో ఒకటి అడుగుతుండేవాడు. ఒకసారి వాళ్ళ పత్రికా ఆఫీసుకి తీసుకెళ్ళాడు. రమేష్ తో "నువ్వు మా ఆఫీసు లోనే పని చెయ్యి" అని ఆఫర్ ఇచ్చేడు. రమేష్ మంచి జీతంతో పత్రికా ఆఫీసు లో పనిలో చేరేడు.
రమేష్ ఆఫీసుకి వెళ్ళడం మొదలెట్టినప్పటి నుండి పరబ్రహ్మం కూడా ఏదో ఒక టైం లో పత్రికా కార్యాలయానికి వచ్చేవాడు. రమేష్ కి అన్నీ వివరంగా చెప్పేవాడు. కూతురు అన్ని పనులూ సమర్ధవంతంగా చేస్తుందని ఆయనకి గొప్ప నమ్మకం.
రమేష్ కి ఆఫీసు లో చేరేక తెలిసిన విషయమేంటంటే
మహేశ్వరి సంగీత విద్వాంసురాలు. ఆ కళ ఆమెకి తన తల్లి నుండి వారసత్వంగా వచ్చింది. ఆమె ఇంకా తన గురువుగారి దగ్గర శిష్యరికం చేస్తోంది. ఆయనతో కలిసి కచేరీలలో పాల్గొంటుంది. ఆమె విదేశాలలో కూడా సంగీత కచేరీలో పాల్గొంటుంది.
్ఆమె లేనప్పుడు పరబ్రహ్మం , మిగతా వాళ్లు పత్రిక పని చూస్తారు. పరబ్రహ్మం కూడా సంగీతమే ప్రధానమనుకుంటాడు.
ఒకరోజు పరబ్రహ్మం రమేష్ ని తాము మొదటి సారి కలుసుకున్న పార్కు కి తీసుకెళ్ళి తన కూతురి గురించి చెప్పడం మొదలెట్టాడు.
ఇది నా స్వీయ రచన
సరస్వతీ పుత్రిక -3
"నా కూతురు బంగారం. అప్పుడప్పుడూ వజ్రమంత కఠినం కూడా. అన్నిటికీ మించి అది సరస్వతీ పుత్రిక. చిన్నప్పుడు వాళ్ళ అమ్మ సంగీత పాఠాలు నేర్పితే ఇట్టే నేర్చేసుకునేది. వాళ్ళ అమ్మ మహేశ్వరి కి ఎన్నో పుస్తకాలు కొని ఇచ్చేది. మహేశ్వరి ఎన్ని పుస్తకాలయినా చదివేసేది. "
"వాళ్ళ అమ్మ కూతురి విషయం లో తన బాధ్యత తీర్చుకుంది. మహేశ్వరిని నాకు అప్పచెప్పేసి నిశ్చింతగా తను వెళ్ళిపోయింది. " ఆయన గొంతు గద్గదమైంది.
"నా భార్య కూతురి కి సంబంధం
చూడమని చెవిన ఇల్లు కట్టుకుని చెప్పేది . ఇప్పుడు ఆ బాధ్యత నాదే కదా "
"సంగీతం, పత్రిక మహేశ్వరి కి రెండు కళ్ళు. నా అనారోగ్యం ఇప్పుడు తనకి పెద్ద సమస్య గా మారింది. నా ఆరోగ్యం బాధ ఉన్నప్పుడే మహేశ్వరికి తగిన వాడిని చూసి పెళ్లి చేద్దామని నా తాపత్రయం."
"నాకు డబ్బు సమస్య లేదు. నా కూతురికి సరైన వరుణ్ణి తేవడమే నాకు ప్రధానం.
" పార్కులో నేను ఇబ్బంది పడటం చూసి నువ్వు నా దగ్గరికి వచ్చి సాయం చేసినప్పటి నుండి నేను నిన్ను గమనిస్తున్నాను. నువ్వు నాకు బాగా నచ్చేవు. మా అమ్మాయిని పెళ్లి చేసుకోమంటే నువ్వు ఏమంటావ్ " అని అడిగేడు పరబ్రహ్మం.
రమేశ్ కి ఏం చెప్పాలో తెలియలేదు. తనలో ఏం చూసి అతను తనని అల్లుడిగా చేసుకోవాలని అనుకుంటున్నాడో తెలియదు.
"మీరు ముందు మీ ఆమ్మాయి తో మాట్లాడండి.ఆమె యిష్టాయిష్టాలు మీరు తెలుసుకోవాలి కదా" అన్నాడు.
"ముందు నీ సమాధానం నాకు తెలియాలి " అన్నాడు పరబ్రహ్మం.
"సరస్వతీ పుత్రికని మీరు మా ఇంటికి పంపిస్తామంటే మేమంతా బ్రహ్మరధం పడతాం" అన్నాడు నవ్వుతూ.
పరబ్రహ్మం కి మహేశ్వరి దగ్గర పెళ్లి ప్రస్తావన తేవడానికి మరో మూడు రోజులు పట్టింది .
మహేశ్వరి తో" నీతో ముఖ్య
విషయం మాట్లాడాలి" అని చెప్పి అప్పుడు తన మనసు లో మాట చెప్పేడు.
మహేశ్వరి "నన్ను ఆలోచించుకోనీ నాన్నా" అని అప్పటికి దాటవేసింది.
పరబ్రహ్మం ఓ వారం రోజులు చూసేడు. మహేశ్వరి ఇంకా ఏం మాట్లాడలేదు.
పరబ్రహ్మం మహేశ్వరితో " రమేశ్ కి ఓ వారం రోజులు సెలవు ఇవ్వు. అతనితో నాకు పని ఉంది" అన్నాడు. మహేశ్వరి సరేనంది.
ఆ వారం రోజులూ సుదర్శన్ పరబ్రహ్మం తోనే ఉన్నాడు. రమేశ్ బొమ్మలు బాగా గీసేవాడు. పరబ్రహ్మం కోరిక మీద పెయింటింగ్ లు వేసేవాడు. పరబ్రహ్మం అంతకు ముందు గోడ మీద ఉన్న పెయింటింగ్స్ మార్చి ఈ కొత్త పెయింటింగ్స్ పెట్టించేడు. రమేశ్ కార్టూనులు బాగా వేస్తాడు. అది తెలుసుకున్న పరబ్రహ్మం అతనితో కార్టూనులు వేయించి తన పత్రికా ఆఫీసుకి పంపించి పత్రిక లో వచ్చేలా చూసేవాడు.
ఆ వారం లో పరబ్రహ్మం రెండు మూడు సార్లు అయినా రమేశ్ తో పాటు వాళ్ల తల్లితండ్రులను కలిసాడు. కానీ ఇద్దరూ వాళ్ళ దగ్గర మహేశ్వరి ప్రస్తావన తేలేదు.
పరబ్రహ్మం రమేష్ ని తన స్నేహితుల ఇళ్లకు తీసుకొని వెళ్ళి తన పత్రిక ఆఫీసులో పనిచేస్తున్న వ్యక్తి గానే వారికి పరిచయం చేసాడు కానీ తనకి కావలసిన వ్యక్తి అని కూడా వాళ్లతో చెప్పేడు.
పరబ్రహ్మం స్నేహితుడు ఒకతను మహేశ్వరికి ఫోను చేసి "మావాడు రమేశ్ తనకి కావలసిన వ్యక్తి అని అంటున్నాడు. ఏంటి కథ "అని అడిగేసాడు.
మహేశ్వరి " అతను నాన్నకి ఆరోగ్యం బాగు లేనప్పుడు సాయం చేసేడు. అందుకే నాన్న అందరితో అలా చెప్తుంటాడు" అంది .
పరబ్రహ్మం కూతురితో "ఒకసారి రమేశ్ వాళ్ల తల్లితండ్రులను మన ఇంటికి రమ్మందామనుకుంటున్నా. నేను వాళ్ల ఇంటికి వెళ్ళేను కదా" అన్నా డు. మహేశ్వరి సరేనంది.
వాళ్లు వచ్చినపుడు పరబ్రహ్మం తనకి ఇష్టమయిన పాట పాడమని మహేశ్వరిని అడిగేడు
ఆమె కాదనలేక ఒక పాట పాడింది. అందరూ ఆమె పాటని బాగా మెచ్చుకున్నారు.
మహేశ్వరికి తండ్రి తను పెళ్లికి అంగీకరించడానికే ఇదంతా చేస్తున్నాడనిపించింది. రమేశ్ ని తను కూడా బాగానే గమనించింది. తండ్రికి రమేశ్ అంత నచ్చినపుడు, తన మనసులో వేరెవరూ లేనప్పుడు తన అంగీకారం తండ్రికి చెప్పడమే మంచిదనిపించింది.
మహేశ్వరి పెళ్లికి అంగీకరించాక పరబ్రహ్మం ఆనందానికి అవధులు లేవు. అతనికి తన కూతురిని ఒక మంచి అబ్బాయి చేతిలో పెడుతున్నానన్న నమ్మకం ఉంది.
మహేశ్వరి రమేశ్ తో కూడా మాట్లాడి తన ఆమోదం అతనికి తెలియచేసింది.
No comments:
Post a Comment