ఇది నా స్వీయ రచన
ఆమెకే తెలుసు
అందంగా మాటలాడటం ఆమెకే తెలుసు.
"అందరినీ బ్రహ్మ దేవుడు సృష్టి స్తే నా మనవరాలిని సరస్వతి సృష్టించింది .అందుకే కన్ను ముక్కు అంత తీరుగా ఉన్నాయి" అనేవారు.
అప్పారావు ఇంటికి వచ్చి తన భర్తకు క్షవరం చేస్తే"వాడి చిట్టిపాదాలు కృష్ణపాదాల్లా మన ఇంట్లో పడితే కాని మీకు తోచదా"అని అడిగేవారు.
కొడుకుని మురిపెంగా "కారైనా దిగడు మారాజు కొడుకు.వాళ్ళు ఏవి ఇస్తే అవి తెచ్చేయడమే" అని మందలించేవారు తెచ్చిన సరుకులు నచ్చకపోతే.
ఆవకాయ కోసం కొడుకుతో కారం తెప్పించి,ఆవకాయ ఊరేక దాన్ని రుచి చూసి "ఈ కారంలో సారం లేదురా" అనేవారు కొడుకుతో .
"గౌరిని నీ ఆడపడుచులా చూసుకుంటావు.ఏ పనీ చెయ్యమనవు" అంటారు మనవరాలితో ,పనిమనిషికి చెప్పి పనిచేయించలేదని.
మనవరాలు "సినిమాకి వెళ్దాం నాయనమ్మా " అంటే "నా బోటనీ కి నీ మేటనీ కి కుదరదులే" అనేవారు నవ్వుతూ.
ఆవిడ కలకత్తా కొడుకింటికి వెళ్లివచ్చేక "కలకత్తా సంగతులేంటి " అని అడిగితే "పోస్ట్ కార్డూ వెళ్లింది.నేనూ వెళ్ళాను కలకత్తా " అనేవారు. అంటే ఎక్కడకీ వెళ్లలేదు, ఏమీ చూడలేదని ఆవిడ ఉద్దేశ్యం.
ఒకరోజు భర్త ఎంత పిలిచినా పలకకపోతే దగ్గరికి వచ్చి "నేను కూడా కోడలు అబ్బాయి ని పిలిచినట్టు హలోజీ అని పిలిస్తేగాని పలకరా" అని అడిగారు.
No comments:
Post a Comment