ఇది నా స్వీయ రచన
ఇంటర్వ్యూ
శోభ కి చెమటలు కారిపోతున్నాయి. చిన్నగా వణుకుతోంది.
ఇంటర్వ్యూ బోర్డు సభ్యులు ఆమెని మంచినీళ్ళు తాగమన్నారు.
ఒకామె శోభ బయోడేటా చూస్తూ "మీ నాన్నగారు డాక్టరా " అన్నారు.
శోభ వెంటనే "అవునండీ. డాక్టర్ ప్రభాకర్ మా నాన్నగారు. మన
సిటీలో ఆయనకి మంచి పేరుంది. " అంది కొంచెం గర్వంగా.
"మీ అమ్మగారు ఏం చేస్తుంటారు?"
"ఆవిడ కూడా లాయర్. పత్రికలన్నీ ఆవిడ గురించి బాగా రాస్తుంటాయి.ఆవిడ సుప్రీంకోర్టు కి కూడా వెళ్తుంటారు. "
"ఏమ్మా, మీ అమ్మ నాన్న అంత గొప్పవాళ్ళు. నువ్వెందుకు అంత భయపడి పోతున్నావు ."
"మొదటిసారి కాదా.అందుకు. మా అన్న ఈ భయం పోవడానికి నన్ను ఇంటర్వ్యూకి వెళ్ళమన్నాడు. "
"మీ అన్నయ్య ఏం చేస్తుంటారు " ఉత్సుకత తో అడిగారు మరొకతను."
మా అన్నయ్య డాక్టరు మురళీ కృష్ణ. గణిత విభాగం లో ప్రొఫెసర్.
ఉత్తమ ఉపాధ్యాయుడిగా ప్రెసిడెంట్ అవార్డు కూడా పొందేడు."
"శోభా, నువ్వు చరిత్ర లో పి.జి.
చేసేవు కదా. గుప్తుల కాలంలో శాస్త్రీయాభివృధ్ధి గురించి చెప్తావా? " ఒక బోర్డు సభ్యుడు అడిగేడు.
" గుప్తుల కాలం స్వర్ణ యుగం అని తప్ప నాకిప్పుడు మరేవీ గుర్తు లేవు."
"నువ్వు బి.ఎ లో రాజనీతి శాస్త్రం చదివావు కదా. 42వ రాజ్యాంగ సవరణ గూర్చి చెప్పమ్మా. "
"సర్, అది నాకు బాగా తెలుసు. కానీ, ఇవాళ చెప్పే పరిస్థితి లో లేను. క్షమించండి. " గ్లాసులో నీళ్ళు తాగింది శోభ.
"నువ్వు అర్థశాస్త్రం చదివావు కదా. మన దేశ నూతన ఆర్ధిక విధానం గురించి చెప్పగలవా"
"అది పి.వి.నరసింహారావుగారి ప్రభుత్వం ప్రారంభించినది తెలుసు "
"ఈ ఇంటర్వ్యూ ముగిసేక నేను
మా స్నేహితురాలు సుమని తీసుకుని ప్రముఖ దర్శకులు ఛాయాదేవి దగ్గరకి వెళ్ళాలి. ఆవిడ అపాయింట్మంట్ దొరకడమే కష్టం. బయట నా స్నేహితురాలు నా కోసం ఎదురు చూస్తోంది. మీరు అనుమతిస్తే. ..." అంటూ లేచింది.
ఇంటర్వ్యూ బోర్డు సభ్యులు శోభ గదిలోంచి వెళ్ళిపోయాక తేరుకున్నారు.
No comments:
Post a Comment